Thursday 19 September 2013

తిరగబడ్డ చీరాల-పేరాల ప్రజలకు బాసటగా నిలచిన

ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌

(1885 -1976)


జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగిన 'చీరాల-పేరాల' పోరాటం చాలా ప్రఖ్యాతిగాంచింది. అద్భుత పోరాటపటిమతో సాగించిన ఈ శాంతియుత ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఆ పోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించిన యోధులలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ఒకరు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం గంటాయపాలెంలో 1885 సెప్టెంబరు 12న ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ జన్మించారు. తల్లితండ్రులు హాజీ మోహిద్దీన్‌ బేగ్‌, ఫాతిమా. గౌస్‌బేగ్‌ తాత ముహమ్మద్‌ దిలావర్‌ బేగ్‌ సంపన్న వ్యాపారవేత్త. చీరాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న వోడరేవులో ఈయన వోడలు ఉండేవి. పెద్ద ఎత్తున గోడవున్సుకు యజమాని. భారీ ఎత్తున వ్యాపారం చేసిన ఘనాపాటి...గౌస్‌ సాహెబ్‌ తండ్రి హయాములో వోడరేవు వ్యాపారం స్థంభించింది. కాని విస్తృతమైన ఆస్థి, సిరిసంపదలు సంక్రమించాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరదావు, 1989, పేజి.60).
ముహమ్మద్‌ గౌస్‌ 1907లో విద్యార్థిగానే వందేమాతరం ఉద్యమం రోజుల్లో జాతీయోద్యమంలో ప్రవేశించారు. బాపట్లకు చెందిన బేగ్‌కు 'చీరాల-పేరాల ఉద్యమం' నిర్మాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పరిచయం ఏర్పడింది. ఆయనతో కలసి 1920లో కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరు కావడంతో గౌస్‌ రాజకీయ జీవితం ఆరంభమైంది. ప్రకాశం జిల్లా చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘం ఏర్పాటు చేసి ప్రజానీకం మీద ప్రభుత్వం అత్యధిక పన్నుల భారం మోపింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రంగ ప్రవేశం చేశారు. ఆయన అత్యంత సన్నిహిత సహచరుడిగా గౌస్‌ బేగ్‌ కూడా ప్రత్యక్షకార్యాచరణకు దిగారు.1921 ఏప్రిల్‌ 6న, విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని దుగ్గిరాల కలిసి ఉద్యమ కార్యాచరణకు అనుమతి పొందడంతో 'చీరాల-పేరాల' ఉద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులలో గౌస్‌ బేగ్‌ ఒకరు. ఈ ఉద్యమంలో ప్రజానీకం ఆర్థిక ఇక్కట్లు పడుతున్నందున పూర్వీకులు సంపాదించి పెట్టిన సంపదను ప్రజావసరాలకు వ్యయం చేశారు. ఆ విధంగా ఉద్యమానికి సర్వసంపదను, వెచ్చించి బలాన్ని చేకూర్చిన యోధుడు జనాబు గౌస్‌ బేగ్‌ గా ఆయన ఖ్యాతిగడించారు. (స్వాతంత్య్రోద్యమం దేశ నాయకులు, వి.యల్‌.సుందరరావు, 1989, పేజి.61)
1921 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. జాతీయోద్యమ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొంటూ వచ్చిన గౌస్‌బేగ్‌ ఒంగోలు కారాగారంలో ఉన్న సందర్భంగా ఐపియస్‌ అధికారి హైదరీ దొర ఆయనను బంగళాకు తీసుకెళ్ళి బ్రాహ్మణ ప్రేరేపిత ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారు. మీ సాహెబులందరికి చెడ్డపేరు వస్తుంది. మీరు కోరుకుంటే 100 లేక 200 ఎకరముల భూమిని మంజూరు చేస్తా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు, ఈ రోజు పండగ రోజు (రంజాన్‌) నన్ను జైలుకు పోనివ్వండి. ఈ దేశభక్తి ఉన్మాదునికి కళంకం ఆపాదించకండి, అని గౌస్‌ సమాధానం చెప్పడంతో, ఆ ఆధికారి ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించాడు. ఆ శిక్షను 1922 మార్చి రెండున నుండి రాజమండ్రి, కడలూరు జైళ్ళలో గౌస్‌ బేగ్‌ అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక 'ఆంధ్రరత్న' గోపాలకృష్ణయ్య స్థాపించిన స్వచ్ఛందసేవకుల దళం 'రామదండు'కు ఆయన నాయకత్వం వహించి, జాతీయోద్యమ భావాలను ప్రజలలో ప్రచారం చేసేందుకు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
ఆనాటి నుండి గౌస్‌ సాహెబ్‌ జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఆస్తి అంతా కరిగిపోయింది. కుటుంబానికి భుక్తినిస్తున్న 23 ఎకరాల భూమిని విక్రయించి మరీ ఉద్యయం కోసం వ్యయం చేశారు. ప్రముఖ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులు, కార్యకర్తలు గౌస్‌ బేగ్‌ ఇంట ఆతిధ్యం స్వీకరించేవారు. ఆనాటి ఉద్యమకారులకు గౌస్‌ గృహం, తమ స్వంతిల్లు లాగుండేది. నగదు నట్రా, పొలం పుట్రా కరిగిపోతున్న, బేగ్‌ దంపతులు బేఖాతర్‌ అన్నారు. మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగలిగిన వారే అదృష్టవంతులని మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ దంపతులు అభిప్రాయపడ్డారు. ఆ ఆభిప్రాయలకు అనుగుణంగా జాతీయోద్యమం కోసం తమ సర్వసంపదలను, చివరకు గౌస్‌ ఖాతూన్‌ ఆభరణాలను కూడా వ్యయంచేశారు. గౌస్‌ బేగ్‌ జాతీయోద్యమంలో ప్రవేశించాక ఆయనకు పూర్వీకులనుండి సంక్రమించిన మణులు, మాన్యాలు, తోటలు, భవంతులు అన్నీ హారతి కర్పూరంలా కరిగి పోయాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఆయన వ్యాపారాలన్నీ స్థంభించి పోయాయి. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌.సుందరరావు)
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సలహా మీద గౌస్‌ వ్యాపారం ఆరంభించారు. ఆయన వ్యాపార సంస్థకు 'రాం రహీమ్‌' అని నామకరణం చేశారు. ఆర్థికంగా పూర్వవైభవాన్ని సంపాదించేందుకు పలు వ్యాపారాలు చేశారు. వ్యాపారం ద్వారా లాభాలు అర్జించటం కంటె ఆయన దృష్టి అంతా జాతీయోద్యమం మీద లగ్నం కావడంతో వ్యాపారాలు లాభాల మాట అటుంచి పూర్తిగా నష్టాల బాటన సాగాయి.
1930-32 ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహానికి ఆయన నాయకత్వం వహించారు. చీరాలలోని యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి స్వచ్ఛంద సేవకులను అడ్డుకుంటున్న పోలీసులను లెక్కచేయకుండా ఉప్పు గుండాలలోకి ప్రవేశించి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన చూపిన చొరవతో మిగిలిన నాయకులు, యువకులు గౌస్‌ను అనుసరించారు. (గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం, మాదల వీరభద్రరావు, పేజి.141). ఈ సందర్భంగా దేవరంపాడు శిబిరానికి గౌస్‌ నాయకత్వం వహించి నడిపారు. ఆ శిబిరాన్ని నడిపినందుకు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్షను ప్రభుత్వం విధించింది. ఈ సందర్భంగా ఆయన పిడికిటిలోని ఉప్పు తీయటానికి పోలీసు లాఠీలు విఫలమైనాయి. ఆయనను ఎన్నోవిధాల హింసించినారు. ఈ సంఘటనను ఆంధ్రదేశమంతట ఎన్నో కథలుగా చెప్పుకున్నారు. ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహించినందుకు, ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1930 ఏప్రిల్‌ 24న ఏడాది జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో ఉన్న కొద్దిపాటి చరాస్థిని వేలం వేసి, లభించిన నగదును జరిమానా క్రింద ప్రభుత్వం జమ చేసుకుంది.
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో గౌస్‌ బేగ్‌ క్రియాశీలక పాత్రను నిర్వహించారు. ఆ ఉద్యమనేత పర్వతనేని వీరయ్య చౌదరి ప్రధాన సహచరుడిగా ఆయన వ్యవహరించారు. ఆ పన్ను నిరాకరణ ఉద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ సాగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పాత్రను నిర్వహించినందున పోలీసుల దాష్టీకానికి పలుమార్లు గురయ్యారు. చివరకు 1932 మార్చి 10న ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, పాతిక రూపాయల జరిమానాను ప్రభుత్వం విధించి వెల్లూరు, రాజమండ్రి జైళ్ళలో నిర్బంధించింది. ఆ తరువాత 1933 జూలై 3న ముహమ్మద్‌ గౌస్‌బేగ్‌ విడుదలయ్యారు.
మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మంచి వక్త. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు ప్రముఖ వక్తగా హజరై ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్రనాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన మితభాషి, నిశ్చల శాంత స్వభావుడు. ఎటువంటి హంగు-ఆర్భాటం, హడావుడి లేకుండా ఒకచోటన స్థిరంగా ఉంటూ కనుసైగలతో ఎంతటి కార్యాన్ని సన్నిహితులతో విజయవంతంగా పూర్తిచేయించగల కార్యదక్షత కలిగిన నాయకుడిగా పేర్గాంచారు. భారతదేశానికి స్వాతంత్య్ర లభించేంత వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాలను ఆయన త్రికరణ శుద్ధిగా పాటించారు. ఆనాడు ఆంధ్రదేశంలో గౌస్‌ బేగ్‌ తెలియనివారు లేరు. (స్వాతంత్య్రోద్యమం దేశనాయకులు, వి.యల్‌. సుందరరావు) మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ మాత్రమే కాకుండా ఆయన సతీమణి గౌస్‌ ఖాతూన్‌ స్వాతంత్రోద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను త్యజించిన ఆ దంపతులు జీవితాంతం ఖద్దరు ధరించారు.
స్వాతంత్య్రం సిద్ధించాక కూడా కొంతకాలం గుంటూరు జిల్లా రాజకీయాలలో మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌ కమిటీ అద్యకక్షునిగా బాధ్యతలను నిర్వహించారు. 1961లో తమ స్వగ్రామం నుండి చీరాలకు వచ్చి గౌస్‌ స్దిరనివాసం ఏర్పరచుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఉంటూ, చీరాల పురపాలక సంఘం సభ్యునిగా విజయం సాధించి పురపాలక సంఘం ఉపాద్యకక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
చిన్ననాట నుండి మతసామరస్యం కోరుతూ వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా, మత దురహంకారాన్ని నిరసిస్తూ, విభిన్న మతస్థుల మధ్యన సద్భావన, సదవగాహన కలిగించడం కోసం హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహ సంబంధాల కోసం నిరంతరం కృషి సల్పారు. మనుషుల మధ్యన మత భేదభావాన్ని ససేమిరా అన్నారు. మతసామరస్యం కాపాడటం, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్యన 'శాంతి-స్నేహం' పటిష్టపర్చేందుకు చివరిశ్వాస వరకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు.
జాతీయోద్యమంలో మహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ ప్రదర్శించిన సాహసానికి త్యాగనిరతికి గౌరవ సూచకంగా 1972 ఆగస్టు 15న భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. చివరి క్షణం వరకు ప్రజలలో దేశభక్తి, స్నేహభావాలను పరిమళింపచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ 1976 సెప్టెంబరు 19న కన్నుమూశారు.
 ' ప్రమాదంలో ఇస్లాం '  నినాదం ప్రమాదాన్ని పసిగట్టి తిరస్కరించిన
 మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని
   

    భారత దేశ విభజన జరగటానికి దోహదం చేసిన పలు కారణాలలో '|ఐఉజుఖ |శ్రీ ఈజుశ్రీస్త్రజూష్ట్ర' అను నినాదం ఒకటి.   ద్విజాతి సిద్దాంతం  పేరిట దేశాన్ని ముక్కలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని ఆశించిన స్వార్ధపరులు హిందూ-ముస్లింల మత మనోభావాలను రెచ్చగొట్టి విజయం సాధించారు. విభజన ద్వారా లబ్ది పొందాలనుకున్న రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్‌ తదితర వ్యక్తులు, శక్తులు తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. ఈ మేరకు సాగిన అన్వేషణలో 'ప్రమాదంలో ఇస్లాం' అను నినాదం బలమైన ఆయిధంగా చిక్కింది. ఆ నినాదం ఆసరాతో ముస్లిం జనావళిని ఉద్వేగాల తుఫానుకు గురిచేశారు. ఆ ప్రమాదాన్ని ఆనాడే పసిగట్టిన పలువురు ముస్లిం నాయకులు, ఆ నినాదం వెనుక గల దురుద్దేశాలను ప్రజలకు వివరించారు. ఆ స్వార్ధపర శక్తుల కుయుక్తులను ఎండగట్టారు. ఆ విధంగా 'ఇస్లాం ఇన్‌ డేంజర్‌'  నినాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటమేకాక, ఆవాంఛనీయ వాతావరణంలో కూడా ఎమాత్రం వెనుకంజవేయకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవిశ్రాంత కృషి జరిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాని ప్రముఖులు.
    1929 జనవరి ఒకటిన మీరట్‌లో జరిగిన 'అహరర్‌' సంస్ధ ప్రాంతీయ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ ఇస్లాం ప్రమాదంలో ఉందంటూ సాగుతున్న ప్రచారం వెనుక గల కుట్రను హేతుబద్దంగానూ, సాహసోపేతంగానూ వివరించారు.' ముస్లింలకు ప్రత్యేక దేశం' అను డిమాండ్‌ సరికాదన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, '...the cry for Islam in Danger is baseless and it could not be protected by Pakistan...Islam cannot be protected by any community but by our own strength and sacrifice...'' అన్నారు. పాకిస్ధాన్‌ ఏర్పడినంత మాత్రాన ఇస్లాం మతానికి ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించారు. అమాయక జనావళిని మభ్య పెట్టేందుకు ఇస్లాం ప్రమాదంలో ఉందని స్వార్దపర శక్తులు ప్రచారం చేస్తున్నాయంటూ, ఆయా శక్తుల ప్రభావానికి లోను కావద్దని ప్రజలు పిలుపునిచ్చారు.
    నమ్మిన విషయాలను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఎటువంటి సదురుబెదురు లేకుండా ప్రకటించే మౌలానా హబీబుర్రెహమాన్‌ 1892 జూలై 3వ తేదీన పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలో జన్మించారు. మౌలానా వంశీకులకు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర ఉంది.  తండ్రి పేరు మౌలానా మహమ్మద్‌ జక్రియా. లూధియానా, జలంధర్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హబీబుర్రెహమాన్‌ చివరకు దేవ్‌బంద్‌ వెళ్ళి ఉన్నత విద్యను పూర్తి చేశారు.
    1903లో లూధియానాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్త మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ కుమార్తె బీబి షఫాతున్నీసాను వివాహమాడారు. ఆమె  భర్తతో పాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మౌలానా తన జీవితంలో మొత్తం మీద 10 సంవత్సరాలకు పైగా జైళ్ళల్లోనే గడిపారు. ఆయన ఆస్తిపాస్తులను అనేక సార్లు ప్రభుత్వం జప్తు చేసింది. పోలీసులు తనిఖీ పేరుతో మౌలానా గృహంపై పలు మార్లు దాడులు జరిపారు. ఆయన ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల కూడా అతి దారుణంగా వ్యవహరించారు. అయినా ఆ తల్లులు అన్నింటినీ సహించారు. చివరకు పసిపిల్లల చెవులలోని దుద్దులను కూడా అపహరించుకు పోయారు. ఎంత నష్టం జరిగినా శ్రీమతి షఫాతున్నీసా కష్టనష్టాలను కడుపులోనే దాచుకున్నారు. ఉత్తమ లక్ష్యం కోసం సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్న భర్త, బిడ్డలను ఆమె చివరివరకు ప్రోత్సహించారు. జప్తుల మూలంగా మౌలానా సర్వం కోల్పోయారు. చివరకు రోజుగడవటం కూడా లేని పరిస్ధితులలో శధిలావస్ధలో ఉన్న ఇంటిలోనే తలదాచుకుంటూ, మౌలానా దంపతులు తమ ఇరువురు కుమార్తెలతో పలు కడగండ్లను అనుభవించారు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ఆ కుటుంబం పోరాట మార్గాన్ని, లక్ష్యాన్ని వీడలేదు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన యోధుల వంశానికి చెందిన మౌలానా రెహమాన్‌ తుదిశ్వాస వరకు ఆ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగించారు. బ్రిటిషర్ల రాజకీయాలను, దేశ ప్రజలను దోచుకుంటున్న తీరుతెన్నులను అవగతం చేసుకుంటూ పాలకుల చర్యలను వ్యతిరేకించారు. చక్కని శరీరాకృతి, వేషభాషలలో నవాబు దర్జాను ప్రతిబింబించే మౌలానా ఉదార హృదయులు. ఆదాయం పెద్దగా లేకున్నా, ఆదుకోమని వచ్చిన వారెవ్వరినీ కూడా వట్టి చేతులతో పోనివ్వని పెద్దమనస్సు అయనది.
    1919నాటి ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనటం, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన మౌలానా రెహమాన్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో  పలు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. 1921 డిసెంబరు 1న ఆయన చేసిన ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను ప్రేరేపించేదిగా ఉందంటూ బ్రిటిష్‌ పోలీసులు వారెంటు జారీ చేశారు.  ఆ వారెంటు ఫలితంగా 1922 డిసెంబరు 22న  తొలిసారిగా అరెస్టయ్యారు.  ఆరు మాసాల జైలు శిక్ష పడింది. ఈ విధంగా ప్రారంభమైన జైలు జీవితం మౌలానా జీవిత కాలాన్ని 15 శాతానికి పైగా హరించి వేసింది. పలు సార్లు శిక్షలు అనుభవించిన ఆయన మొత్తం మీద పది ఏండ్లకు పైగా దేశంలోని వివిధ జైళ్ళల్లో గడిపారు. ఆయన జైలు జీవితం గడపటమే కాక, విప్లవకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మీద ఆయనతనోపాటుగా ఆయన కుమారులను కూడా పలుమార్లు అరెస్టు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వం కారాగారంలో నిర్భందించింది.
    ఆధ్మాత్మిక విషయాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం వహించే లక్ష్యంతో ఏర్పడిన JAMIAT-UL-ULEMA-HIND సంస్ధలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంస్థ జాతీయభావాలను ప్రచారం చేస్తూ, వేర్పాటు భావనలను నిరశిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచింది. జాతీయ భావాల ప్రచారం కోసం తన మిత్రులను ప్రోత్సహించి ANEES   అను ఉర్దూ పత్రికను లూధియానాలో మౌలానా ప్రారంభింపజేశారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మీద ఆయన 1920 లో MAJLIS-E-AHARAR ( The Society of Freemen) అను సంస్ధను ప్రారంభించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు కృషి చేయటం, దేశ విభజన డిమాండ్‌ను వ్యతిరేకించటం, ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ప్రధాన లక్ష్యాలుగా అహరర్‌ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ కార్యకర్తలు జాతీయోద్యమంలో అసమాన త్యాగాలను, పోరాట పటిమను ప్రదర్శించారు. శాసనోల్లంఘనోద్యమంలో అరహర్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపర్చటం, ఉద్యమంలో భాగస్వాములు చేయడం,  ముందుకు నడిపించటంలో మౌలానా ఎంతో నేర్పుతో వ్యవహరించేవారు. అహరర్‌కు బలమైన కేంద్రాలుగా నున్న కాశ్మీర్‌, కపుర్తలా, బదవాల్‌ పూర్‌, ఖదియాన్‌లలో శాసనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగించారు.
    ప్రముఖ విప్లవకారుడు భగత్‌ సింగ్‌ అసెంబ్లీలో బాంబులు విసిరాక,  ప్రభుత్వ దమనకాండకు భయపడి ఆయన కుటుంబీకులకు ఆశ్రయం కల్పించేందుకు పంజాబ్‌ ప్రజలు ఎవ్వరూ కూడా ముందుకు రాని భయానక వాతావరణంలో భగత్‌ సింగ్‌ కుటుంబీకులకు నెల రోజులపాటు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయగా, ఆ అరెస్టును తప్పించుకోడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా ఆనాడు మౌలానా తన ఇంట ఆశ్రయం కల్పించారు. పంజాబ్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ దాష్టికాలకు అంతూపొంతూ లేకున్న వాతావరణంలో బోస్‌కు ఎక్కడా తలదాచుకోడానికి అవకాశం లభించలేదు. ఆజ్ఞాతంలో ఉన్న ఆయన పంజాబ్‌లోని లుధియానాకు వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మౌలానా లుధియాని స్వయంగా సుభాష్‌ ను ఆహ్వానించి బ్రిటిష్‌ పోలీసుల కళ్ళుగప్పి ఆశ్రయమిచ్చారు. మౌలానా ఇంట వారం రోజులు గడిపిన బోస్‌ తిరిగి బెంగాల్‌ వెళ్పిపోయారు.(The Milli Gazette, Fortnightly Feb.16-28, 2013, Page No.23). ఈ విధంగా ఇతరులెవ్వరూ విప్లవకారులకు, జాతీయోద్యమకారులకు ఆశ్రయం, రక్షణ కల్పించడానికి ముందుకు రాని రోజుల్లో మౌలానా హబీబుర్రెహమాన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏమాత్రం భయపడకుండా సహచరులైన స్వాతంత్య్రసమరయోధులను ఆదుకున్నారు.
     1931లో మూడు వందల మంది ఆంగ్ల ప్రభుత్వ పోలీసు అధికారులు, పోలీసుల సమక్షంలో నిర్భయంగా లుధియానలోని ఐనీబినీరి అబిళీబి ఖబిరీశీరిఖి వద్ద భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకావిష్కరణ గావించి మౌలానా ఆర్టెయ్యారు. భారత విభనన లక్ష్యంగా ప్రజలలో మతం పేరిట మానశిక విభనను తీసుకరావడం ప్రధాన బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులు, విభజనకారులు లుధియానా రైల్వే స్టేషన్‌లో 'హిందూ వాటర్‌' 'ముస్లిం వాటర్‌' అంటూ రెండు వేర్వేరుగా మంచినీటి కుండలు ఏర్పాటుచేశారు. ఈ  ఏర్పాటు గురించి తెలుసుకున్న మౌలానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్యను తీవ్రగా నిరసిస్తూ జాతీయోద్యమకారులు, వేర్పాటువాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తన సహచరులు, అనుచరులైన హిందూ-ముస్లిం-సిక్కు సోదరులను కలుపుకుని తాను స్వయంగా రైల్వేస్టేషన్‌ వెళ్ళి అక్కడ ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన ఆ వేర్వేరు మంచి నీటి కుండలను పగులగొట్టి ఆరెస్టుకు గురయ్యారు.
    భారత జాతీయ కాంగ్రెస్‌ బాటన నడిచినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలన్నింటినీ మౌలానా సమర్థించ లేదు.  ఆయా నిర్ణయాలను విశ్లేషించుకుని సమర్దించటం లేదా నిశితంగా విమర్శించటం అయన ప్రత్యేకత. విమర్శించటంలో ఆయన  ఎంతటివారైనా ఖాతరు చేసేవారు కారు. 1937లో జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌లో అనుసరించిన విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహత్మా గాంధీని కూడా ఆయన ఎమాత్రం ఉపేక్షించలేదు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ తారాచంద్‌ ప్రస్తావిస్తూ ,  'Even loyalty to the Congress, unswerving faith in the leadership of Ganghiji and deep attachment to  Jawaharlal Nehru could not deter him from differing from them, speaking to them firmly and warning them of the evil consequences of what he consider to be wrong decisions.' అన్నారు. పంజాబ్‌లో సిక్కులను సంతృప్తి పర్చేందుకు  నెహ్రూ నివేదికను పరిగణలోనికి తీసుకోలేదని గాంధీజీని ఆయన చాలా నిశితంగా విమర్శించారు.  హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్యన శాంతి-సామరస్యాలకు, ఐక్యతకు తగినంత వాతావరణం సృష్టించకుండానే, గాంధీజీ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్ళారని మౌలానా విమర్శించారు.   
     సమాజంలోని ధనిక-పేద వర్గాల మధ్య నున్న అంతరాల గురించి మౌలానా ఆలోచించేవారు. బ్రిటిష్‌ ప్రభుత్వం సాగించిన జప్తుల వలన సర్వం కొల్పోయినా,  తనకున్న తానితో ఆశ్రితులను సంత్పప్తి పర్చుతూ, ప్రజలు ఈ దుస్థితి నుండి శాశ్వితంగా బయట పడాలని కోరుకున్నారు.  ఆర్దిక సమానత్వం సాధించటం ద్వారా మాత్రమే అన్ని రకాల అసమానతలను సమాప్తం చేయవచ్చన్నారు. సామ్యవాద వ్యవస్ద నిర్మించటం కోసం కృషి సల్పాలని కోరారు. ప్రస్తుత భారతీయ సమాజం ఎదుర్కోంటున్న రుగ్మతలకు సామ్యవాద సిద్ధాతం మాత్రమే ఔషధమని విశ్వసించారు. ఆసమానతలను అంతంచేసే సామ్యవాద వ్యవస్ధ నిర్మాణం కోసం రాజకీయ పార్టీలు పని చేయాలని ఆకాంక్షించారు. ధనికుల పెత్తనం సాగుతున్న ప్రస్తుత ఆంగ్ల ప్రభుత్వాన్ని నిర్మూలించాలన్నది తన ధ్యేయమని మౌలానా ప్రకటించారు. సామ్యవాద వ్యవస్ధ అభిమానించిన ఆయన కమ్యూనిస్టు పార్టీలో మాత్రం చేరలేదు.  ఇస్లాం మతం మూల సూత్రాలను ఎంతో శ్రద్ధతో పాటించే, మతాచారపరాయణుడైన మౌలానా సామాజిక సమస్యల పరిష్కారానికి మతాతీతంగా ఆలోచించారు.  1940లో జరిగిన ఆజాద్‌ ముస్లింల సమావేశంలో భారత విభజన, హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు. భారత విభజనను వ్యతిరేకిస్తూ తయారైన ప్రతిపాదన తీర్మానంగా రూపుధరించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.
    జీవితపర్యంతం జాతీయవాదిగా కొనసాగిన మౌలానా నమ్మిన సిద్దాంతాల పట్ల నిబద్దతతో  నిలిచారు.  స్వజనుల నుండి, విమర్శలు వచ్చినా చలించలేదు. ఆయన నిర్మోహమాటి కావటంతో పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  జయాపజయాలను లెక్కచేయకుండా ఓర్పు, సహనంతో సర్వం కొల్పోయినా ముందుకు సాగారు. భారత విభజన పరిణామాల ఫలితంగా, ఆ మహనీయుని కుటుంబం  శరణార్దుల శిబిరంలో శరణు పొందాల్సి వచ్చింది. పుట్టిపెరిగిన లూధియానాను పదలాల్సి వచ్చింది. చివరకు ఢిల్లీ వెళ్ళి అపరిచితుల గృహంలో తలదాచుకోవాల్పి వచ్చింది.ఈ దుష్పరిణామాలకు కలత చెందిన మౌలానా భార్య షఫాతున్నిసా ఎంతో కృంగిపోయారు.  '..ఇందుకోసమేనా? ..మనం అన్ని కష్టనష్టాలకోర్చింది? ఏమిటిదంతా?...మనం మన ఇంటికి ఎప్పుడు పొందాం? మన లూధియానకు ఎప్పుడు వెళ్ళిపోదాం...' అంటూ పదే పదే ప్రశ్నించే సతీమణిని ఓదార్చలేక ఆయన సతమతమై పోయారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు మౌలానా హబీబుర్రెహమాన్‌ను చివరికంటా వెంటాడుతూనే ఉండిపోయాయి. చివరకు  ' His devotion to principle such as martyrs might envy.  He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.'  అంటూ శ్రీ తారాచంద్‌చే ప్రశంసలు పొందిన మౌలానా హబీబుర్రెహామాన్‌ 1956 సెప్టెంబర్‌ 2న కన్నుమూశారు.
===
From Syed Naseer Ahamed,